Sunita Williams: మరోసారి అంతరిక్షయానానికి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 గంటలకు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక ‘బోయింగ్ స్టార్‌లైనర్‌’ ద్వారా ఆమె ప్రయాణించనున్నారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండడంపై సునీత విలియమ్స్ స్పందించారు.

ఈసారి కాస్త ఆందోళనగా ఉందని, అయితే ప్రయాణంపై అంత భయం లేదని అన్నారు. లాంచ్ ప్యాడ్‌ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు.

ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు ‘స్పేస్ వాక్’ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. మొత్తం 10 స్పేస్‌వాక్‌ల ద్వారా ఆమె ఈ ఘనత సాధించారని నాసా గణాంకాలు చెబుతున్నాయి. కాగా సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా, తల్లి బోనీ పాండ్యా దంపతులు గుజరాత్‌కు చెందినవారనే విషయం తెలిసిందే. అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తినడానికి ఇష్టపడతానని గతంలో ఆమె పలుమార్లు చెప్పారు.
Sunita Williams
Boeing Starliner
Kennedy Space Center
international space center

More Telugu News