AyyannaPatrudu: అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు ముద్దంటున్నాడు.. వీడియో ఇదిగో!

  • జగన్ మాటలు నమ్మేదెలాగని ప్రశ్నించిన అయ్యనపాత్రుడు
  • కియా కంపెనీపై జగన్ మాటమార్చారంటూ వీడియో ట్వీట్
  • నాడు వద్దన్న కంపెనీలో నేడు తనవల్లే ఉద్యోగాలు వచ్చాయని జగన్ ప్రచారం
TDP Leader Ayyanapatrudu Tweet On Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై టీడీపీ సీనియర్ నేత అయ్యనపాత్రుడు మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు ఒకమాట, అధికారం చేతికందాక మరో మాట అన్నతీరుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రానికి తీసుకొచ్చిన కియా కార్ల కంపెనీపై జగన్ మాటమార్చిన విధానాన్ని ప్రజల ముందుంచారు. ఈమేరకు కియా కార్ల కంపెనీపై జగన్ నాడు ఏమన్నాడు.. నేడు ఏమంటున్నాడంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో జగన్ మాట్లాడిన రెండు సందర్భాలు కనిపిస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కియా కంపెనీని రాష్ట్రం నుంచి వాపస్ పంపించేస్తామని జగన్ అనడం వీడియోలో చూడొచ్చు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ఉద్యోగ కల్పనపై సీఎం జగన్ మాట్లాడుతూ.. కియా కార్ల కంపెనీ ద్వారా 3 వేల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అయ్యనపాత్రుడు ‘అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు ముద్దంటున్నాడు. నాడు కియా పరిశ్రమను  వ్యతిరేకించిన జగన్‌మోహన్‌రెడ్డి.. నేడు తమవల్లే ఉద్యోగాలు వచ్చాయంటూ గొప్పలు చెబుతున్నాడు’ అంటూ కామెంట్ పెట్టారు. జగన్ హామీలను ఎలా నమ్మడమంటూ అయ్యనపాత్రుడు ప్రశ్నించారు.

More Telugu News