విజయవాడ తూర్పులో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయం: గద్దె రామ్మోహన్

  • నేడు నామినేషన్ వేస్తున్న గద్దె రామ్మోహన్
  • భారీ ర్యాలీగా నామినేషన్ వేయడానికి బయల్దేరిన గద్దె
  • జగన్ ప్రభుత్వ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలని వ్యాఖ్య
విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నేడు గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రామ్మోహన్ నామినేషన్ కార్యక్రమం కోసం వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి గద్దె రామ్మోహన్ నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతోంది. 

మరోవైపు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ... తూర్పు నియోజకవర్గంలో మూడోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. టీడీపీ అభిమానుల అండతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని తెలిపారు. మన వల్లే తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసని... అబద్ధాలు ప్రచారం చేసే వారికి ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకుంటామని చెప్పారు. జగన్ మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జనసేన, బీజేపీ మద్దతుతో 50 వేల మెజార్టీ సాధిస్తాననే నమ్మకం తనకుందని చెప్పారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని... చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.



More Telugu News

Gadde Rammohan Telugudesam Jagan YSRCP