Payyavula Keshav: ఏపీలో తొలి నామినేషన్ పయ్యావుల కేశవ్ దే!

  • ఏపీలో జోరుగా నామినేషన్లు
  • ఉరవకొండలో  నామినేషన్ దాఖలు చేసిన పయ్యావుల
  • ఈ ఉదయం 11.05 గంటలకు పయ్యావుల నామినేషన్ దాఖలు
Payyavula Keshav files the first nomination in AP

ఏపీలో అసలైన ఎన్నికల వేడి నేడు రాజుకుంది. నాలుగో దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో, నామినేషన్ల ఘట్టం మొదలైంది. కాగా, ఏపీలో అందరికంటే మొదటి నామినేషన్ వేసింది టీడీపీ నేత పయ్యావుల కేశవ్.

ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పయ్యావుల తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ ఉదయం 11.05 గంటలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పయ్యావుల అర్ధాంగి హేమలత, కుమారుడు విజయసింహ ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ కు సమర్పించారు. 

ఇక, ఇవాళ ఇప్పటివరకు నామినేషన్ వేసిన వారిలో రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కూడా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు రాజమండ్రిలో కార్పొరేషన్ కార్యాలయం వరకు మూడు పార్టీల కూటమి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ర్యాలీలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా పాల్గొన్నారు. 

అటు, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. గంటా మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 

ఏపీలో ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంటుంది.

More Telugu News