కవితను జైల్లోనే విచారించేందుకు సీబీఐకి అనుమతి... నిబంధనలు వర్తిస్తాయి!
- కవితను ప్రశ్నించేందుకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు
- ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు
- విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచన
ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించారు. కోర్టు అనుమతించడంతో వచ్చే వారం ఆమెను విచారించాలని సీబీఐ భావిస్తోంది. గతంలో నమోదు చేసిన స్టేట్మెంట్, అప్రూవర్గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత సీబీఐ మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముంది.
ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయని, మద్యం విధానం రూపొందించిన ప్రయివేటు వ్యక్తులకు లబ్ధిచేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి బుచ్చిబాబు ఫోన్లో దొరికిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించవచ్చునని తెలుస్తోంది. భూముల కొనుగోలు వ్యవహారంపై కూడా సీబీఐ దృష్టి సారించవచ్చునని తెలుస్తోంది.