Raghuram Rajan: అదే అతిపెద్ద తప్పు.. భారత్‌ను హెచ్చరించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

  • ఆర్థిక వృద్ధి దృఢంగా ఉందనే ప్రచారాన్ని నమ్మొద్దన్న ఆర్థిక నిపుణుడు
  • ఈ తరహా ప్రచారాన్ని నమ్మితే పెద్ద తప్పు చేసినట్టేనని వ్యాఖ్య
  • రాజకీయ నాయకుల ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని విమర్శలు
  • శ్రామికశక్తి విద్య, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచన
India is making a big mistake believing the hype around its strong economic growth says Raghuram Rajan

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందనే ప్రచారాన్ని నమ్మి పెద్ద తప్పు చేస్తోందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ వృద్ధిని సాధించాలంటే ముఖ్యమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి శ్రామికశక్తి విద్య, నైపుణ్యాల మెరుగుదల అంశం ప్రధాన సమస్యగా మారుతుందని అన్నారు. ఈ సవాలును పరిష్కరించకపోతే దేశ యువ జనాభా ప్రయోజనాలను పొందలేదని అన్నారు.

ఈ ప్రచారం నిజమవడానికి ఇంకా చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రచారాన్ని జనాలు నమ్మాలని రాజకీయ నాయకులు భావిస్తుంటారని, తాము సాధించామని చెప్పుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారని అన్నారు. అయితే భారత్ ఈ ప్రచారాన్ని నమ్మడం తప్పు అవుతుందని అన్నారు. మరోవైపు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని రఘురామ్ రాజన్ కొట్టిపారేశారు. దేశంలోని చాలా మంది పిల్లలకు హైస్కూల్ స్థాయి చదువులేనప్పుడు, మధ్యలోనే చదువు మానేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి లక్ష్యం గురించి మాట్లాడడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో శ్రామిక శక్తి ఉందని, యువత మంచి ఉద్యోగాలలో ఉపాధి పొందితేనే దేశానికి ప్రయోజనమని అన్నారు. శ్రామికశక్తికి ఉద్యోగాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

More Telugu News