Varalakshmi Sarath Kumar: 34 ఏళ్ల‌కు పిల్ల‌ల‌ను క‌నాల‌నుకున్నా.. కుద‌ర్లేదు: వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌

  • త‌న సినీ, వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలను వెల్లడించిన‌ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్
  • 18 ఏళ్ల‌ వ‌య‌సులోనే క‌థానాయిక‌గా అవ‌కాశం
  • ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రం 'బాయ్స్‌'లో హీరోయిన్‌గా ఛాన్స్‌
  • తండ్రి శ‌ర‌త్ కుమార్ వ‌ద్ద‌ని చెప్ప‌డంతో వెన‌క్కి
  • 2012లో 'పోడాపోడీ' మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం
  • 32 ఏళ్ల‌లో పెళ్లి చేసుకుని 34 ఏళ్ల‌లో పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్లాన్ చేసుకున్నానన్న వ‌ర‌లక్ష్మి 
  • త‌న సినీ, వ్య‌క్తిగ‌త జీవితాల్లో వేసుకున్న ప్లాన్ వ‌ర్కౌట్ కాలేద‌ని వాపోయిన వైనం  
Varalakshmi Sarath Kumar Interesting Comments on Her Personal Life Journey

త‌న సినీ, వ్య‌క్తిగ‌త జీవితం గురించి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో తాజాగా కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. 18 ఏళ్ల‌ వ‌య‌సులోనే క‌థానాయిక‌గా అవ‌కాశం వ‌చ్చింద‌ని, కానీ చిన్న వ‌య‌సులో సినిమాలు వ‌ద్ద‌ని తండ్రి శ‌ర‌త్ కుమార్ చెప్ప‌డంతో మానుకున్న‌ట్లు తెలిపారు. అది కూడా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రం 'బాయ్స్‌'లో అని ఆమె చెప్పారు. ఆ త‌ర్వాత 2012లో ధ‌నుష్ స‌ర‌స‌న 'పోడాపోడీ' మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన‌ట్లు పేర్కొన్నారు. 

విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో వ‌ర‌ల‌క్ష్మీకి వెంట‌నే అవ‌కాశాలు రాలేదు. దాంతో తెలుగు, క‌న్న‌డ సినిమాల్లో వ‌చ్చిన అవ‌కాశాలను అందిపుచ్చుకుని న‌టిగా నిరూపించుకున్నారు. ఆ త‌ర్వాత బాలా డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన  'తారై త‌ప్ప‌ట్టై' చిత్రంతో నాయ‌కిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక దక్షిణాదిలో సంచ‌ల‌న న‌టిగా ముద్ర వేసుకున్న ఆమె ఇప్పుడు ఎలాంటి పాత్ర‌నైనా, ఏ భాష‌లోనైనా చాలా అల‌వొక‌గా న‌టించే స్థాయికి చేరుకున్నారు. 

ప్ర‌స్తుతం వ‌ర‌లక్ష్మికి 38 ఏళ్లు. గ‌త నెల‌లోనే వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు. ముంబైకి చెందిన నిక్కోలాయ్ స‌చ్‌దేవ్‌ను ఆమె పెళ్లాడబోతున్నారు. ముంబైలో ఆర్ట్ గ్యాల‌రీ న‌డుపుతున్న ఆయ‌న‌తో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌కు 14 ఏళ్ల స్నేహం ఉందట‌. అయితే, నిక్కోలాయ్ స‌చ్‌దేవ్‌కు ఇది రెండో పెళ్లి. మొద‌టి భార్య‌తో విడాకులు అయిన‌ట్లు స‌మాచారం. 

అయితే, త‌న సినిమా, వ్యక్తిగ‌త జీవితం తాను చేసుకున్న ప్లాన్ ప్ర‌కారం జ‌ర‌గ‌లేద‌ని ఆమె వాపోయారు. త‌న మొద‌టి చిత్రం 'పోడాపోడీ'లో న‌టించిన‌ప్పుడు త‌న వ‌య‌సు 22 ఏళ్లు అని, ఎలాగైనా 28 ఏళ్ల‌లోపు స్టార్ న‌టిగా ఎద‌గాల‌ని భావించినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే 32 ఏళ్ల‌లో పెళ్లి చేసుకుని 34 ఏళ్ల‌లో పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్లాన్ చేసుకున్నానని, కానీ ఇప్పుడు త‌న వ‌య‌సు 38 ఏళ్లు అని వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ చెప్పారు. 

ఇలా త‌న సినీ, వ్య‌క్తిగ‌త జీవితాల్లో వేసుకున్న ప్లాన్ వ‌ర్కౌట్ కాలేద‌ని తెలిపారు. పోడాపోడీ మూవీ త‌ర్వాత ప‌ర్స‌న‌ల్ లైఫ్‌పై ఎక్కువ‌గా దృష్టిపెట్ట‌డ‌మే తాను చేసిన పెద్ద త‌ప్పుగా ఆమె పేర్కొన్నారు. అందువ‌ల్ల త‌న సినీ జీవితం బాధించింద‌న్నారామె. అప్పుడే తాను సినిమాల‌పై దృష్టి సారించి ఉంటే ఎక్కువ చిత్రాలు చేసి ఉండేదానిన‌ని అన్నారు.

More Telugu News