Chandrababu: పొత్తుల వల్ల కొందరికి టికెట్లివ్వలేకపోయా: చంద్రబాబు

  • మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లు ఉన్నారని వెల్లడి
  • వారి త్యాగం మరువలేనన్న టీడీపీ అధినేత
  • పార్టీపరంగా, సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరణ
Chandrababu Speech

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. టీడీపీ కోసం పనిచేసిన 31 మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. అయితే, పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని, ఇకపైనా మర్చిపోబోనని స్పష్టం చేశారు. మూడు పార్టీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లు ఉన్నారని చెప్పారు. పొత్తుల కారణంగా అందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదని వివరించారు. పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఈ మూడు పార్టీల నేతల త్యాగాల పునాది రాష్ట్ర భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.

రాగద్వేషాలకు, రికమెండేషన్లకు అతీతంగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే వారిని, నిలబెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. టికెట్ దక్కని నేతల త్యాగాన్ని పార్టీ గుర్తుంచుకుంటుందని, ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలుగుతోందని, రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు ప్రజాసేవకు ముందుకు వస్తారని పేర్కొన్నారు.

రాజకీయాలను జగన్ వ్యాపారం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే అని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తారని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. పురందేశ్వరిపై, పవన్ కల్యాణ్ పై, జనసేన పార్టీపై.. అందరిపైనా తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News