ఆ పోస్టులు తొలగించండి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

  • ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదుపై చర్యలు
  • 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశాలు
  • వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై సీఈవో ముకేశ్ కుమార్ స్పందన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌పై సీఎం జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసేలా ప్రచారం చేస్తున్నారని, అసభ్యకర ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందిస్తూ నోటీసులు పంపారు. టీడీపీ సోషల్‌మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు.

ఇదిలావుంచితే, ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీయే కూటమి సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత వాయుసేన హెలికాఫ్టర్‌ను ఉపయోగించారంటూ టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లేందుకు టెయిల్ నంబర్ 5236 గల ఐఏఎఫ్ హెలికాప్టర్‌ను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


More Telugu News

Chandrababu Telugudesam YS Jagan Election Commission Andhra Pradesh YSRCP