Diabetes: నూతన ఆవిష్కరణ.. బెలూన్‌లోకి గాలి ఊదడం ద్వారా డయాబెటిస్ టెస్ట్!

  • వైద్య చరిత్రలో మరో సంచలనం
  • బెలూన్‌ లాంటి పరికరాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు
  • రూ. 16 వేలకే అందుబాటులోకి
  • మరిన్ని మార్పులతో త్వరలోనే మార్కెట్లోకి
IIT Mandi Researches developed device to detect sugar levels without blood

మధుమేహ రోగులకు ఇది శుభవార్తే. శరీరంలో చక్కెర స్థాయులను తెలుసుకునేందుకు ఇకపై మాటిమాటికి సూదితో గుచ్చి రక్తం తీసుకోవాల్సిన పనిలేదు. సంప్రదాయ పద్ధతులతో పనిలేకుండా సరికొత్త విధానం దాదాపు అందుబాటులోకి వచ్చింది. శ్వాస ద్వారా తెలుసుకొనే బెలూన్‌లాంటి సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో రోగులు శ్వాసను ఊదితే అది ఆక్సిజన్, బీపీ వివరాలు చెబుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో ఆ రెండు వివరాలతోపాటు అది అడిగే మరికొన్ని వివరాలు నమోదు చేస్తే అన్నింటినీ క్రోడీకరించి శరీరంలో మధుమేహ స్థాయులను వెల్లడిస్తుంది. ఈ పరికరానికి శాస్త్రవేత్తలు ‘నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్’ అని పేరు పెట్టారు. 

ఈ పరికరంతో ఇప్పటి వరకు పలు పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చినట్టు సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రీతు తెలిపారు. ఈ నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్‌లో 10 మల్టీ సెన్సార్లను అమర్చినట్టు పేర్కొన్నారు. రూ. 16 వేలకే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డయాబెటిస్ పరీక్షలకే కాకుండా గుండెపోటు లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించే సెన్సార్లను కూడా ఇందులో అమర్చబోతున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఈ పరికరం పరిమాణం పెద్దగా ఉందని, దీనిని తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు.

More Telugu News