హమ్మయ్య! కృత్రిమ మేధతో ఇప్పటికైతే ఉద్యోగాలకు ఎసరు లేనట్టే!
- ఏఐపై ఎంఐటీ అధ్యయనం
- ఇప్పటికిప్పుడు ఏఐతో ఉద్యోగాల భర్తీ కష్టమని తేల్చిన స్టడీ
- ఏఐతో పోలిస్తే మానవ కార్మికులే చవకన్న ఎంఐటీ
- కంప్యూటర్ విజన్ టాస్కులకు దశాబ్దాలు పట్టే అవకాశం ఉందన్న అధ్యయనం
మానవశ్రమను ఏఐతో భర్తీ చేయడంలో ఉన్న అనుకూలతలపై ఎంఐటీ అధ్యయనం చేసింది. ఏఐని ఎక్కువ సమయం ఉపయోగించడం కంటే కొన్ని నిర్దిష్ట పనుల కోసం మనుషులను ఉపయోగించుకోవడమే మేలని, అంతేకాకుండా ఏఐతో పోలిస్తే ఇది చాలా చవక అని కూడా అధ్యయనం తేల్చింది. ఆటోమేషన్ ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉండదని ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పరిశోధకుడు నీల్ థాంప్సన్ స్పష్టం చేశారు.
కార్మికుల వేతనాల్లో 23 శాతం మాత్రమే ఏఐ ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చని, కాకపోతే ఇప్పటికీ కొన్ని రంగాల్లో కార్మికులు తక్కువ వేతనాలకే లభిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏఐతో దృశ్య గుర్తింపు సాంకేతికతను వ్యవస్థాపించడం, ఆపరేట్ చేయడం చాలా ఖరీదైనదని వివరించారు. కంప్యూటర్ విజన్ టాస్కులు కంపెనీలకు ఆర్థికంగా అనుకూలంగా మారేందుకు దశాబ్దాలు పడుతుందని అధ్యయనం అంచనా వేసింది. కాబట్టి ఇప్పటికిప్పుడు కృత్రిమ మేధతో ఉద్యోగాలకు వచ్చే ముప్పేమీ లేనట్టే!