Roja: దేశంలో డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు: రోజా

  • మోదీపై చంద్రబాబు ఎన్నో విమర్శలు చేశారన్న రోజా
  • అమిత్ షా కారుపై రాళ్లు వేయించారని విమర్శ
  • చంద్రబాబుతో కలవడం వల్ల బీజేపీకే నష్టమని వ్యాఖ్య
Chandrababu is dirty politician says Roja

బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా చంద్రబాబు సిద్ధపడతారని ఆమె విమర్శించారు. దేశంలోనే ఆయన డర్టీ పొలిటీషియన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ముఖ్యమంత్రిగా పనికిరారని, ప్రధానిగా పనికిరారని చంద్రబాబు ఎన్నో రకాలుగా మాట్లాడారని... ఏపీకి వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులు నల్ల జెండాలను ఎగరేయడాన్ని మోదీ మర్చిపోయి ఉండరనే తాను అనుకుంటున్నానని చెప్పారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదని రోజా అన్నారు. బీజేపీతో ఉన్నప్పుడు సొంత లాభాలను చూసుకుని... ఆ తర్వాత కాంగ్రెస్ తో చేతులు కలిపారని... ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలిసేందుకు వెళ్తున్నారని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. సీఎం కావడం కోసం ఎవరితోనైనా కలిసేందుకు చంద్రబాబు సిద్ధపడతారని... ఈ విషయాన్ని మోదీ గమనించాలని చెప్పారు. 

పురందేశ్వరితో కలిసి అమిత్ షాను నారా లోకేశ్ కలిశారని... ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని రోజా చెప్పారు. ఇద్దరి మధ్య ఏ ఒప్పందం కుదిరిందో వాళ్లే చెప్పాలని అన్నారు. చంద్రబాబుతో కలవడం వల్ల బీజేపీకే నష్టమని చెప్పారు.

More Telugu News