Red Sandal: కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు

  • అన్నమయ్య జిల్లా చీనెపల్లె వద్ద దారుణం
  • వాహనాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్ ను ఢీకొట్టి, పరారైన స్మగ్లర్లు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన కానిస్టేబుల్
Red Sandal smugglers killed Constable in AP

ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల దారుణాలు పెరిగిపోతున్నాయి. అడ్డు వచ్చిన వారిని అంతం చేయడానికి కూడా వారు వెనుకాడటం లేదు. తాజాగా అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారం నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వచ్చింది. దీంతో సుండుపల్లి సరిహద్దులో ఉన్న గొల్లపల్లి చెరువు వద్ద కాపుకాశారు. 

ఈ సమయంలో ఎర్రచందనం తరలిస్తున్న వాహనం ఆ మార్గంలో వచ్చింది. వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేశ్ ప్రయత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు ఆయనను వాహనంతో ఢీకొట్టి, పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ గణేశ్ ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి వాహనంతో పాటు, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News