Viral Video: కలియుగం పతాకస్థాయికి చేరుకుందా?.. ఆస్తి కోసం తండ్రిని కొట్టి చంపిన వీడియోపై నెటిజన్ల విస్మయం

  • తమిళనాడులోని పెరంబళూరులో ఘటన
  • కుమారుడి దెబ్బలకు తాళలేక తండ్రి మృతి
  • వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల ఫైర్
  • ఆ మృగాన్ని కూడా అలాగే ట్రీట్ చేయాలని డిమాండ్
Father repeatedly punched in face by son here is viral video

ఆస్తి సంబంధించిన గొడవలో కన్నతండ్రిని ముఖంపై విచక్షణ రహితంగా, ఆపకుండా పిడిగుద్దులు కురిపించి, ఆపై కాళ్లతో తన్ని ఆయన మరణానికి కారణమయ్యాడో కుమారుడు. తమిళనాడులోని పెరంబళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ ప్రైవేటు కంపెనీ యజమాని అయిన 65 ఏళ్ల కులందైవేలు ఇంట్లో సోఫాపై కూర్చుని ఉండగా కోపంగా వచ్చిన కుమారుడు సంతోష్ ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో రక్తం కారుతూ ఆయన అలాగే కుప్పకూలిపోయారు. ఈ నెల 18న ఆయన మరణించారు. ఆ తర్వాత కూడా కోపం చల్లారని సంతోష్ కాళ్లతో తండ్రిని తన్నాడు. తండ్రిపై దాడిచేస్తున్న కుమారుడిని చూసిన ఇతర కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని అతడిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విడిపించుకుని తండ్రిపై దాడి చేయాలన్న కోపంతో ఊగిపోయాడు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంతోష్‌పై కేసు నమోదైంది.  వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కలియుగం పతాకస్థాయికి చేరుకుందని కొందరు కామెంట్ చేస్తే.. కన్నతండ్రిపై ఇంత దారుణంగా దాడిచేసిన అతడిని కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేశారు. పోలీసులు అతడిని కూడా అదే విధంగా చేయాలని ఇంకొందరు కోరారు. ఇలాంటి మృగం విషయంలో పోలీసులు ఇంకా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News