YS Vivekananda Reddy Murder Case: రూ. 5 కోట్లు ఇస్తామని ఆశచూపి నా భర్తను బలి పశువును చేశారు.. దస్తగిరి భార్య సంచలన వ్యాఖ్యలు

రూ. 5 కోట్లు ఇస్తామని ఆశ చూపించి తన భర్తను బలిపశువును చేశారంటూ ఏపీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిపై వివేకా హత్యకేసు అప్రూవర్ దస్తగిరి భార్య షబానా సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలోని తన నివాసంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆమె చేసిన ఈ ఆరోపణలు సంచలనమయ్యాయి. అప్పుడు కోట్ల రూపాయల ఆశలు చూపించి చేయని తప్పుకు జైలుకు పంపారని, ఇప్పుడేమో బయటకు రాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత వారినే హత్య చేసిన వారు తమను వదిలిపెడతారని అనుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉండడంతో రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు గుర్తు చేశారు. తన భర్తకు పోలీసులు, వైసీపీ కార్యకర్తలే శత్రువులుగా మారారన్న షబానా .. తన భర్తకు బెయిలు తెచ్చుకున్నా బయటకు రానివ్వడం లేదన్నారు. 

వారు ఎలాంటి తప్పు చేయకుంటే తన భర్తను జైలు నుంచి బయటకు రానివ్వాలని, అడ్డుకుంటే కనుక వారు తప్పు చేసినట్టు అంగీకరించినట్టేనని తెలిపారు. వివేకా హత్య కేసులో జైలులో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారులు ఇటీవల తన భర్తను కలిసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత తమకు డబ్బులు ఇవ్వలేదని షబానా స్పష్టం చేశారు. 
YS Vivekananda Reddy Murder Case
Dastagiri
Shabana
YS Jagan
YS Avinash Reddy

More Telugu News