ఏప్రిల్ 16న ఎన్నికలు అంటూ ప్రచారం... సీఈవో కార్యాలయం ఏం చెప్పిందంటే!
- దేశంలో సమీపిస్తున్న ఎన్నికలు
- లోక్ సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు
- ఏప్రిల్ 16 లోపు ఎన్నికల పనులు పూర్తి చేయాలనుకుంటున్నామన్న సీఈవో
ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అనే వార్త నిజమేనా అని కొన్ని మీడియా సంస్థలు తమను వాకబు చేస్తున్నాయని ఢిల్లీలోని సీఈవో కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని, దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు తేదీ అని స్పష్టం చేసింది.
ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఈ నెల 19న అధికారిక లేఖను జారీ చేశామని వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుందని సీఈవో కార్యాలయం తెలిపింది.