కోవర్ట్ నాని ఎక్కడున్నా చేసేది అదే: టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా

Nagul Meera take a dig at Kesineni Nani
  • వైసీపీలో చేరిన కేశినేని నాని
  • జగన్ గొప్ప వ్యక్తిగా కనిపించాడా అంటూ నానీని నిలదీసిన నాగుల్ మీరా
  • వైసీపీలోనూ నానీని భరించలేరని వ్యాఖ్యలు 
టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానీపై టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ధ్వజమెత్తారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు పక్కన నిలబడ్డ వ్యక్తి, నేడు వైసీపీ ఛోటా నాయకుల భజన చేసే దుస్థితికి వచ్చాడని విమర్శించారు. 

కల్తీ మద్యం క్వార్టర్ రూ.200లకు ఎందుకు అమ్ముతున్నారో, లారీ ఇసుక రూ.12 వేలు అంతకుమించి అమ్మడంపై కేశినేని నానీ మాట్లాడాలని నిలదీశారు. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చయితే, జగన్ రెడ్డి సర్కార్ రూ.400 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిందో నానీ చెప్పాలని డిమాండ్ చేశారు. 

వచ్చే ఎన్నికల్లో నానీపై టీడీపీ అభ్యర్థి 2 లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని నాగుల్ మీరా స్పష్టం చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంలో నానీ పాత్ర చంద్రబాబుకి కాగితాలు అందించడమేనని అన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేశినేని నానీకి మోసగాడిగా, ద్రోహిగా కనిపించిన జగన్ రెడ్డి, నేడు గొప్ప వ్యక్తిగా కనిపించడం హాస్యాస్పదమని అన్నారు. 

పీఆర్పీ, టీడీపీల మాదిరే త్వరలోనే వైసీపీ కూడా నానీని భరించలేమనే స్థితికి వస్తుందని, నానీకి నైతిక విలువలు లేవు అనడానికి అతను చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని నాగుల్ మీరా పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మొదట ప్రారంభమయ్యేది రాజధాని పనులేనని నానీ తెలుసుకోవాలని అన్నారు. 

తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు!

రాజధాని అమరావతి గురించి నానీ చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ అసంబద్ధమైనవి. అమరావతిలో చదరపు గజం భూమి రూ.8వేలు ఉందంటున్న నానీకి విజయవాడలో చదరపు గజం ఎంత ఉందో తెలియదా? విజయవాడలో రూ.10వేలు ఉంటే, హైదరాబాద్ లో రూ.18వేలు ఉంది. భూములపై నిరాధార ఆరోపణలు చేసి చేసి... వైసీపీ వాళ్లు తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నానీ గతంలో వారు చేసిన నిరాధార ఆరోపణలనే మళ్లీ చేస్తున్నాడు.

వైసీపీ వాళ్లకు బ్రహ్మాండంగా భోజనాలు పెడుతున్నాడు!

నానీ ఎక్కడున్నా చేసేది కోవర్ట్ ఆపరేషన్లే. వైసీపీలో ఉండి మరో పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తాడు. గతంలో టీడీపీలో ఉంటూ వైసీపీ కోవర్ట్ గా పనిచేశాడు. తెలుగుదేశం గెలవదని సర్వేలు చెబుతున్నాయి అంటున్న నానీ... అదే పార్టీ బీ-ఫామ్ కోసం ఎందుకు వెంపర్లాడాడు? 

తెలుగుదేశంలో ఉన్నప్పుడు తన పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల్ని పిలిచి వారితో మాట్లాడి, వారికి ఏనాడూ భోజనం పెట్టించని కేశినేని నానీ, ఇప్పుడు వైసీపీవారికి బ్రహ్మండంగా భోజనాలు పెడుతున్నాడు. ఢిల్లీలో కూడా ఇలానే వ్యవహరించాడు.
Go Back to Shorts
Nagul Meera
Kesineni Nani
TDP
YSRCP
Vijayawada

More Telugu News