Ayodhya Ram Temple: అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య.. రామ్ లల్లా విగ్రహం తొలి ఫొటో ఇదిగో!

  • నిలబడిన రూపంలో రామ్ లల్లా నల్లరాతి విగ్రహం
  • ఐదేళ్ల బాలుడిగా కనిపించిన రామయ్య
  • ముఖం పరదాతో కప్పివున్న తొలి ఫొటో విడుదల
This is the first photo of Ram Lalla statue in the sanctum sanctorum of Ayodhya Ram temple

యావత్ దేశం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు గురువారం కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రత్యేక పూజలతో మధ్యాహ్న సమయంలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ఆలయం గర్భగుడిలో పెట్టారు. 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ వరకు బాల రాముడు విశేష పూజలు అందుకోనున్నాడు. కాగా గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం తొలి ఫొటో బయటకొచ్చింది. విగ్రహం ముఖాన్ని పరదాతో కప్పి ఉంచినప్పటికీ మిగతా రూపు కనిపించింది. నిలబడిన ఆకారంలో ఐదేళ్ల పిల్లవాడిగా అయోధ్య రామయ్య కనిపించాడు. నల్లరాతితో 51 అంగుళాల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కాడు. 

కాగా జనవరి 22న 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి భక్తులు ‘అయోధ్య రాముడు’ని దర్శించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వారిలో క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ఉన్నారు.

More Telugu News