Guntur Kaaram: 'బుక్ మై షో'లో 70 వేల నెగెటివ్ ఓట్లు... ఫిర్యాదు చేసిన 'గుంటూరు కారం' చిత్రబృందం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన'గుంటూరు కారం' చిత్రానికి నెగెటివ్ ప్రచారం చాలా డ్యామేజి చేసింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనూహ్యరీతిలో నెగెటివిటీ కోరల్లో చిక్కుకుంది. అయితే, గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా, మహేశ్ బాబు స్టామినా ఏంటో చూపిస్తూ, మాంచి కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. 

కాగా, ఎవరో పనిగట్టుకుని మహేశ్ బాబు కొత్త సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా, గుంటూరు కారం చిత్రానికి వ్యతిరేకంగా బుక్ మై షో టికెట్ పోర్టల్ లో 70 వేల నెగెటివ్ రేటింగ్ లు వచ్చినట్టు గుర్తించారు. దీనిపై చిత్రబృందం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ చిత్రానికి వ్యతిరేకంగా 'బుక్ మై షో' పోర్టల్ లో నెగెటివ్ ఓట్లు వేసి తమ చిత్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని చిత్రబృందం తన ఫిర్యాదులో పేర్కొంది. 70 వేల బాట్ లను సృష్టించి రివ్యూలను తారుమారు చేసిన పరిస్థితి కనిపిస్తోందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది. 

కాగా, గుంటూరు కారంపై నెగెటివ్ రేటింగుల విషయంలో ఫిలిం చాంబర్ కూడా జోక్యం చేసుకుంది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో 70 వేల నెగెటివ్ రేటింగులు రావడం సందేహాస్పదంగా ఉందని, దీంట్లో నిగ్గు తేల్చాలని బుక్ మై షో పోర్టల్ నిర్వాహకులకు ఫిలిం చాంబర్ లేఖ రాసింది.
Guntur Kaaram
Negative Ratings
Book My Show
Cyberabad
Mahesh Babu
Trivikram Srinivas
Haarika And Hassine Creations
Tollywood

More Telugu News