Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో రోహిత్-పాండ్యా మధ్య ఇగో సమస్య.. పరిష్కారం చెప్పిన యువరాజ్

  • రోహిత్ కెప్టెన్సీలో ముంబైకి ఆడిన హార్దిక్ పాండ్యా
  • ఈ సీజన్‌లో ముంబైకి కెప్టెన్‌గా మారిన హార్దిక్
  • ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తాయంటూ వార్తలు
  • ఇద్దరూ కలిసి ఆడడం వల్ల ఇలాంటి సమస్యలు కామనేనన్న యువీ
  • కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చన్న మాజీ ఆల్‌రౌండర్
Hardik Pandya vs Rohit Sharma Ego Clash Over Mumbai Indians Captaincy Yuvraj Singh Says Solution

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌శర్మ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడని, ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. వారిద్దరికీ నిజంగా ఈ విషయంలో అలాంటి సమస్యే ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా దానిని పరిష్కరించుకోవచ్చని సలహా ఇచ్చాడు.

ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ ఇప్పుడు హార్దిక్ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో సహజంగానే ఇగో సమస్య తెరపైకి వచ్చింది. హార్దిక్ పాండ్యా ముంబైకి ఆడినప్పుడు అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. ముంబైకి ఆడినప్పుడు పాండ్యా డెత్ ఓవర్లలో బ్యాట్‌కి పనిచెప్పేవాడు. గుజరాత్‌కు వెళ్లిపోయాక నంబర్ ఫోర్‌లో అచ్చమైన బ్యాటర్‌గా ఆడాడు. 
 
కొత్త జట్టు గుజరాత్‌కు కెప్టెన్ అయ్యాక తొలి ప్రయత్నంలోనే ఆ జట్టుకు టైటిల్ అందించాడు. 2024 ఐపీఎల్ వేలానికి ముందు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పూర్వ జట్టు ముంబై ఇండియన్స్‌కు వచ్చేసి జట్టుకు కెప్టెన్ అయిపోయాడు. దీంతో ఇప్పటి వరకు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ ఆటగాడిగా పరిమితమైపోయాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య అహానికి సంబంధించిన సమస్య ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన యువరాజ్‌సింగ్.. ఆటగాళ్లు కలిసి ఆడినప్పుడు ఇలాంటి సమస్యలు రావడం సహజమేనని పేర్కొన్నాడు. ఇద్దరూ కూర్చొని చర్చించుకోవడం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపాడు.

More Telugu News