Mahindra: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన స్పాన్సర్ గా మహీంద్రా సంస్థ

  • జనవరి 10 నుంచి దక్షిణాఫ్రికా టీ20 లీగ్
  • జోబర్గ్ సూపర్ కింగ్స్ ప్రధాన స్పాన్సర్ గా మహీంద్రా సంస్థ
  • సోషల్ మీడియాలో స్పందించిన ఆనంద్ మహీంద్రా
Mahindra as principle sponsor to Joburg Super Kings in SA T20 League

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మహీంద్రా దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించనుంది. 

ఐపీఎల్ లో మేటి జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య సంస్థ సీఎస్ ఎల్ కే లిమిటెడ్ దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతదారుగా కొనసాగుతోంది. ఇప్పుడీ జోబర్గ్ సూపర్ కింగ్స్ ను మహీంద్రా సంస్థ స్పాన్సర్ చేయనుంది. ఈ మేరకు ఓ వీడియోను మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. అందులో జోబర్గ్ సూపర్ కింగ్స్ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తదితరులు మహీంద్రా లోగోతో ఉన్న జెర్సీలు ధరించి కనిపించారు. 

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ఆరు జట్లు తలపడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్, పార్ల్ రాయల్స్, ప్రెటోరియా క్యాపిటల్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ జట్లను వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలే స్థానిక భాగస్వామ్యంతో నిర్వహిస్తుండడం విశేషం. 

కాగా, ఈ టోర్నీ తాజా సీజన్ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనుంది.

More Telugu News