Chandrababu: సీఈసీతో ముగిసిన సమావేశం.... వీళ్లను వదిలేస్తే అరాచకమేనని చెప్పామన్న చంద్రబాబు

  • కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్
  • విజయవాడలో సమావేశం నిర్వహించిన సీఈసీ
  • సమావేశం ముగిసిన అనంతరం మీడియా ముందుకు చంద్రబాబు, పవన్
Chandrababu and Pawan Kalyan met CEC in Hyderabad

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీఈసీతో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. 

చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ  ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా రాజకీయ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. 

రాష్ట్రంలో ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎక్కడా పనిచేసుకోనివ్వని పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 

ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు రావడంతో, హోల్ సేల్ గా ఓటర్లందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వచ్చారని చంద్రబాబు వివరించారు. దీనికి సంబంధించి సీఈసీకి ఇవాళ ఒక ఉదాహరణ ఇచ్చామని, ఒక్క చంద్రగిరిలోనే ఫారం-6 కింద 1 లక్ష 15 వేల ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33 వేల ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. 

ఎన్నికల విధులకు కేటాయించే అధికారిని సెలెక్షన్ విధానంలో కాకుండా, ఆలిండియా లెవల్లో అత్యుత్తమ పనితీరు ఆధారంగా ఎంపిక చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామని పేర్కొన్నారు. 

"ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే... ఆలిండియా లెవల్లో టీచర్లను, ప్రభుత్వ అధికారులను, అనుభవం ఉండే వ్యక్తులను నియమించుకుంటారు. కానీ, వాళ్లను మేం ఇవ్వలేం అని చెప్పిన ప్రభుత్వం... చివరికి ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా... సచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వీళ్లు నామినేట్ చేసిన వ్యక్తులతో ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు.

బీఎల్వోలుగా 2,600 మంది మహిళా పోలీసులను నియమించారు. నాకిది ఆశ్చర్యం వేస్తోంది. బీఎల్వోలుగా ఏంచేయాలో మహిళా పోలీసులకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ మేం అడుగుతున్నామని మాపైనా, జనసేన పైనా 6 వేల నుంచి 7 వేల వరకు అక్రమ కేసులు పెట్టారు. ఈ కేసుల బారినపడి ఒక్క పుంగనూరులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లారు. ఎన్నికల్లో విపక్షాలను పనిచేసుకోనివ్వరాదనే ఈ అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్లు కోరుకున్నది జరిగితే ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది. 

మొన్న తెలంగాణలో ఒక్క రోజులోనే ఎన్నికలు ఎంతో సజావుగా జరిగాయి. అసలు ఎన్నికలు జరిగాయా, లేదా అనేంత సాఫీగా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఏపీలో పరిస్థితులు అన్నింటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తిగా వివరించాం. మేం చెప్పింది వారు ఓపిగ్గా విన్నారు. మేం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం... ఫలితాలు మీరే చూస్తారు అని గట్టిగా చెప్పారు. 

ఈ సందర్భంగా మేం ఏం కోరుతున్నామంటే... కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే  కేంద్ర పోలీసు పరిశీలకులను పంపించాలి. ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలను పర్యవేక్షించాలి" అని చంద్రబాబు వివరించారు.

More Telugu News