T20 World Cup: ప్ర‌పంచ‌​కప్​కు సిరాజ్ వద్దు.. మాజీ క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  • ప్లేయింగ్ 11లో ఐదుగురు బౌలర్లు ఎవ‌రు ఉండాల‌నే విష‌యంపై ఇర్ఫాన్ ప‌ఠాన్‌, శ్రీకాంత్‌ల‌ భిన్నాభిప్రాయం  
  • ఐదుగురు బౌల‌ర్ల‌లో ముగ్గురు పేస‌ర్లుగా బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌, సిరాజ్‌ను ఎంపిక చేసిన ప‌ఠాన్‌
  • ప‌ఠాన్‌ ఎంపికతో ఏకీభవించని కృష్ణ‌మాచారి శ్రీకాంత్
  • బుమ్రా, అర్ష్‌దీప్‌తో పాటు అవేశ్‌ ఖాన్‌ను మూడో పేసర్‌గా తీసుకోవాలని సూచ‌న‌
Mohammed Siraj is can not be India third pacer for T20 World Cup says Kris Srikkanth

2024 ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌కప్ కోసం భారత జట్టు ఎంపికకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది స్పోర్ట్స్ అన‌లిస్టులు, మాజీ క్రికెట‌ర్లు టీమ్‌ కాంబినేషన్‌పై తమ విశ్లేషణలు చెబుతున్నారు. ఇదే కోవ‌లో తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. తుది జ‌ట్టులోని 11 మందిలో ఐదుగురు బౌలర్లు ఎవరు ఉండాలి? అనే విష‌యాన్ని వివరించ‌డం జ‌రిగింది.

"ప్లేయింగ్ 11లో ఐదుగురు బౌలర్లు తప్పనిసరి. వికెట్ ఆప్షన్లుగా మణికట్టు స్పిన్నర్లు బిష్ణోయ్, కుల్దీప్ ఆడతారు. టీ20ల్లో బిష్ణోయ్ గణాంకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఐపీఎల్‌లో రాణిస్తుండటంతో ఇప్పుడు అందరూ చాహల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఫీల్డింగ్ కూడా కీలకమని మర్చిపోవద్దు" అన్నాడు.

ప‌ఠాన్ ఇంకా మాట్లాడుతూ..  "నా ఎంపికలో 8, 9, 10, 11 స్థానాల‌లో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉంటారు. దుబే, హార్దిక్, యశస్వి జైస్వాల్‌ వంటి ప్లేయర్‌లు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలరు. ప్రస్తుతం టీమిండియా ఏం చేయబోతుందని పరిశీలిస్తే, నాకు తెలిసి రవీంద్ర జడేజాను 7వ స్థానంలో ఆడించవచ్చు. టామ్ మూడీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను" అని చెప్పాడు.

జ‌స్ప్రీత్‌ బుమ్రాతో పాటు తుది జ‌ట్టులో ఉండే పేస‌ర్లు ఎవరు?
వ‌ర‌ల్డ్‌కప్ జట్టులో ముగ్గురు పేసర్లు ఎవరనే దానిపై కూడా ఇర్ఫాన్‌ పఠాన్ స్పందించాడు. "ప్రస్తుతం బ్లైండ్‌గా సెలక్ట్‌ చేసుకోగలిగింది జ‌స్ప్రీత్‌ బుమ్రాని మాత్రమే. మరో ఇద్దరు పేసర్లు కావాలి. గతంలో మ‌హ్మ‌ద్‌ సిరాజ్‌ దక్షిణాఫ్రికా సిరీస్ ఆడాడు. రెండు మ్యాచ్‌లలో ఒకటి లేదా రెండు వికెట్లు పడగొట్టాడు. మంచి ఎకానమీ ఉంది. దక్షిణాఫ్రికాపై వికెట్ల పరంగా అర్ష్‌దీప్ గ‌ణాంకాలు అంత బాగా లేవు. కానీ ఐపీఎల్‌లో అర్ష్‌దీప్‌ గణాంకాలు గొప్ప‌గా ఉంటాయి. సిరాజ్ ప్రదర్శన ఐపీఎల్ 2024లో  అంత‌ బాగా లేదు. నేను సెలక్షన్ ప్యానెల్‌లో కూర్చుంటే, ఎక్స్‌పీరియన్స్‌ని ఓటు వేస్తాను. 

బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌, సిరాజ్‌ను తీసుకెళ్లమని చెబుతాను. ఇంకా ఖలీల్ అహ్మద్. మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ వంటి వాళ్లు ఉన్నారు. మయాంక్ చాలా పాప్యులర్‌ అయ్యాడు. అతనికి పేస్ ఉంది, కానీ పెద్దగా క్రికెట్ ఆడలేదు. మోహ్సిన్‌ ఖాన్‌ కూడా హైట్‌ ఉంటాడు. దాదాపు 140తో బౌలింగ్‌ చేస్తాడు. అతనికీ పెద్దగా అనుభవం లేదు. ఇప్పుడు అతిపెద్ద సమస్య ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్‌. కాబట్టి ఎక్స్‌పీరియన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడం మేలు. సిరాజ్, అర్ష్‌దీప్‌, బుమ్రాను ఎంపిక చేసుకోవచ్చు" అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

మ‌హ్మ‌ద్‌ సిరాజ్ ఎందుకు? అత‌డి అవ‌స‌రం లేదు: కృష్ణ‌మాచారి శ్రీకాంత్  
పఠాన్ కో-ప్యానెలిస్ట్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్.. ప‌ఠాన్‌ ఎంపికతో ఏకీభవించలేదు. "బుమ్రా, అర్ష్‌దీప్‌తో పాటు సిరాజ్‌ని కాకుండా అవేశ్‌ ఖాన్‌ను మూడో పేసర్‌గా తీసుకోవాలని పేర్కొన్నాడు. 'మూడో పేసర్‌గా సిరాజ్ కాలేడు. ఒక మ్యాచులో బాగా బౌలింగ్ చేస్తాడు. ఆపై 10 గేమ్‌లలో తుస్సుమ‌నిపిస్తాడు. అతడు అస్థిరమైన బౌలర్. డెత్ ఓవర్లలో ఎవరు బాగా బౌలింగ్ చేస్తున్నారో చూడాలి. అవేశ్‌ ఖాన్ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడికి కొద్దిగా అనుభవం కూడా ఉంది. ఇటీవ‌ల‌ వైడ్ యార్కర్లపై కూడా ప్రావీణ్యం సంపాదించాడు. నా మూడో పేసర్ అవేశ్‌ ఖాన్. కాబట్టి సిరాజ్ ఎందుకు? అతను ప్రారంభంలో బౌలింగ్ చేయగలడు కానీ చివరిలో కాదు. నేను సిరాజ్‌ని తీసుకోను" అని మాజీ బీసీసీఐ సెల‌క్ట‌ర్‌ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ స్ప‌ష్టం చేశాడు.

More Telugu News