నా తండ్రి కేశినేని నాని పట్ల టీడీపీ నేతలు అవమానకరంగా వ్యవహరించారు: కేశినేని శ్వేత

  • పోటీ నుంచి తప్పుకోండని తన తండ్రికి ముందే చెప్పి ఉంటే బాగుండేదన్న శ్వేత
  • విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేస్తారని వెల్లడి
  • కేశినేని చిన్నికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్య
విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని ఆమె తెలిపారు. తన తండ్రి పట్ల టీడీపీ నాయకత్వం చాలా అవమానకరంగా వ్యవహరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ టికెట్ గురించి తమను పిలిపించుకుని మాట్లాడి ఉంటే బాగుండేదని... తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం బాధాకరమని చెప్పారు. ఎంపీ పోటీ నుంచి మీరు తప్పుకోండని తన తండ్రికి సూచించి ఉంటే బాగుండేదని అన్నారు. అలా కాకుండా... అభ్యర్థిని మార్చాలని ముందే నిర్ణయం తీసుకుని, చివరకు తమకు చెప్పారని తెలిపారు. 

విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేయడం ఖాయమని... అది ఇండిపెండెంట్ గానా? లేక మరో పార్టీ నుంచా? అనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది తన తండ్రి ఇంకా నిర్ణయించలేదని... అన్ని పార్టీల నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కూడా లేరని చెప్పారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం మానేసి... విజయవాడ మీద పడ్డారని విమర్శించారు. కేశినేని నానిని కాదని కేశినేని చిన్నికి పార్టీ నాయకత్వం ఎందుకంత ప్రాధాన్యతను ఇస్తోందో అర్థం కావడం లేదని చెప్పారు. కేశినేని చిన్ని గురించి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోలేనని అన్నారు.

Kesineni Swetha
Kesineni Nani
Kesineni Chinni
Telugudesam
Vijayawada

More Telugu News