మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం

  • వచ్చే ఎన్నికల్లో సీటు విషయమై ప్రాధేయపడినట్టు జోరుగా ప్రచారం
  • తిరుపతి జిల్లాలో దళిత సామాజిక వర్గ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆసక్తికర పరిణామం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ అధిష్ఠానం పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్చుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్లు పైకి చెప్పుకుంటున్నప్పటికీ  వచ్చే ఎన్నికల్లో సీటు విషయమై ప్రాధేయపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దిరెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే ఆదిమూలం కలిశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 

కాగా తిరుపతి జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు ముగ్గురిని మార్చనున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే ఆదిమూలం కలవడం చర్చనీయాంశమైంది. ఇటీవల వైకాపా పెద్దల వద్ద ఎమ్మెల్యే తన ఆవేదనను తెలియజేసినట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో మంత్రి చెప్పిన విధంగానే పనులన్నీ పూర్తి చేశానంటూ వాపోయారంటూ తెలుస్తోంది. ఇక పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఇటీవల బహిరంగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాదనే సందేహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


More Telugu News

MLA Adimulam Minister Peddireddy YSRCP Andhra Pradesh