Sabitha Indra Reddy: రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారు?: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy questions about KalyanaLaxmi gold
  • కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న సబితా ఇంద్రారెడ్డి
  • కళ్యాణలక్ష్మి వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయన్న సబితా ఇంద్రారెడ్డి
  • పేదింటి ఆడబిడ్డల పెళ్లి భారం కాకూడదనే కేసీఆర్ ఈ పథకం తెచ్చారని వెల్లడి
కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిందని... ఈ పథకాన్ని త్వరగా ప్రారంభించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్‌ మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ... కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు చెప్పారు. దేశంలోనే మరెక్కడా ఇలాంటి పథకం లేదని తెలుసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని సూచించారు.
Sabitha Indra Reddy
BRS
Telangana

More Telugu News