YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు: సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కుమార్తె, అల్లుడిపై చార్జిషీటు దాఖలు

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అధికారి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురిపై పులివెందుల అర్బన్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 

వివేకా హత్య కేసులో వైసీపీ నేతల పేర్లు చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి చేశారని, విచారణ సందర్భంగా సీబీఐ క్యాంపు కార్యాలయంలో తన బిడ్డల ఎదుటే తీవ్రంగా కొట్టారని వివేకా పీఏ కృష్ణారెడ్డి అప్పట్లో పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు పెట్టారు. అంతేకాదు, హైదరాబాదులోని వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంటకి వెళ్లినప్పుడు... సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో, పులివెందుల న్యాయస్థానం కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే పులివెందుల అర్బన్ పోలీసులు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి, తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు.
YS Vivekananda Reddy
Murder Case
Charge Sheet
CBI SP Ram Singh
Suneetha Reddy
Rajasekhar Reddy
Pulivendula

More Telugu News