Nara Lokesh: మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తావా? అని చంద్రబాబు అడిగారు: లోకేశ్

  • మంగళగిరిలో నారా లోకేశ్ పర్యటన
  • నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు
  • మంగళగిరి ప్రజలది మంచి మనసు అని కితాబు
  • గ్రూపు రాజకీయాలు వద్దని నేతలకు స్పష్టీకరణ
Lokesh held meeting with Mangalagiri constituency TDP cadre

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో కీలక సమావేశం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. 


మీది మంచి మనసు

విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన నా ప్రాణ సమానమైన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు. మంగళగిరి ప్రజలది మంచి మనసు. మంగళగిరి మినీ ఆంధ్రప్రదేశ్ వంటిది. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలవారు మంగళగిరిలో నివసిస్తున్నారు. గతంలో గ్రామగ్రామానికి తిరిగి చేనేతలు, స్వర్ణకారులు, బీసీలు, దళితులు, ఎస్టీలు, మైనారిటీల సమస్యలను తెలుసుకున్నాను. యువగళం యాత్రలో అనేక సమస్యలు విన్నపుడు నాకు మంగళగిరి గుర్తుకు వచ్చేది. పాదయాత్రలో వారు చెప్పే సమస్యలన్నీ నేను మంగళగిరిలోనే తెలుసుకున్నాను. 

ప్రజలు దయచూపకపోయినా నేను నియోజకవర్గాన్ని వదిలి వెళ్లలేదు

2019లో గతంలో టీడీపీ ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో నేను పోటీచేశాను... ప్రజలు దయ చూపలేదు. ఆనాడు లోకేశ్ ఏమిటో ప్రజలు తెలుసుకోలేకపోయారు... ఎన్నికల్లో ఓడినా నేను నియోజకవర్గాన్ని వీడలేదు. గత నాలుగేళ్ల 9 నెలల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యాను... సొంత నిధులతో 27 సంక్షేమ కార్యక్రమాల అమలు చేశాను. అన్న క్యాంటీన్ల ద్వారా పేద వారి ఆకలి తీర్చాం... పెళ్లి కానుకలు అందజేశాం. 

స్వయం ఉపాధి కోసం తోపుడు బండ్లు అందించాం. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మెషీన్లు అందించాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా ఉచితంగా వైద్యం, మందులు ఇస్తున్నాం, 'యువ' పేరుతో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ అందిస్తున్నాం, 'జలధార' పేరుతో ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నాం, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. 

యువత కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం... వివిధ క్రీడాంశాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం. దివ్యాంగుల కోసం ట్రై సైకిల్స్ ఇచ్చాం, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు అందించాం, స్వర్ణకారులకు లక్ష్మీ నరసింహ స్వర్ణకార సహకార సంఘం ఏర్పాటు చేశాం. పురోహితులు, పాస్టర్లు, ఇమామ్ లకు పండుగ కానుకలు ఇస్తున్నాం. రోడ్లు రిపేర్ చేశాం, కొన్ని రోడ్లు వేశాం. 

నాయి బ్రాహ్మణులకు సెలూన్ చైర్స్ అందించాం, కార్మికుల కోసం వెల్డింగ్ మెషీన్స్ అందించాం. కోవిడ్ సమయంలో వైద్య సహాయం అందించాం. టీడీపీ కార్యకర్తలకు ఆర్ధిక సాయం అందించాం. ఆర్ఎంపీ డాక్టర్లకు వైద్య పరికరాలు అందించాం. వేసవిలో చలి వేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశాం. దళిత బిడ్డల పెళ్లికి తాళిబొట్లు అందిస్తున్నాం, చేనేత కార్మికులకు రాట్నాలు అందించాం.

మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు

ఓడినపుడు చాలామంది నన్ను ఎగతాళి చేశారు. మళ్లీ మంగళగిరి నుంచే పోటీచేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారు... మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, తగ్గేదే లేదని చెప్పాను. గత నాలుగేళ్ల 9 నెలలుగా వైసీపీ ప్రభుత్వం మంగళగిరికి చేసింది గుండుసున్నా. రెండుసార్లు వైసీపీని గెలిపించారు... అలాంటప్పుడు మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలి? ఇప్పుడు ఎమ్మెల్యేనే మారిపోయే పరిస్థితి వచ్చింది! 

ఆర్కే ఎమ్మెల్యేగా రాజీనామా చేశాక మీడియా మిత్రులతో మాట్లాడుతూ మా సీఎం మంగళగిరి ప్రజలను మోసం చేశారని చెప్పారు. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని మాటతప్పి, మడమ తిప్పారు... ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి నయాపైసా కేటాయించలేదు. ఇప్పుడు ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పారు.

ఇక వంద రోజులు మాత్రమే మిగిలుంది

ఇక మనముందు ఉన్నది కేవలం వందరోజులు మాత్రమే. నియోజకవర్గంలోని పెద్దల వద్దకువెళ్లి కలుస్తున్నాను. సమయాన్ని బట్టి అందరినీ కలుస్తా. నాయకులకు ఇగోలు వద్దు... అందరం కలిసి పనిచేద్దాం. ఓటర్ వెరిఫికేషన్ పై కేడర్ అంతా దృష్టిసారించాలి, ఇందుకోసం క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ ఏర్పాటుచేశాం.

 ప్రతిగడపకు వెళ్లి మన హామీలను ప్రజల్లోకి వెళ్లాలి, ఇప్పటికి 52 వేల ఇళ్ల వద్దకు వెళ్లారు... జనవరికల్లా అన్ని ఇళ్లకు వెళ్లాలి. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు, ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

గ్రూపు రాజకీయాలు వద్దు

కార్యకర్తలు, నాయకులు గ్రూప్ రాజకీయాల జోలికి వెళ్లవద్దు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో ఎవరు పనితీరు కనబరుస్తారో వారినే నేను గౌరవిస్తాను. వారానికి 5 రోజులు ఓపిగ్గా ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోండి. 

వైసీపీ వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లండి


వైసీపీ వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లి మనం అమలుచేసే పథకాలు తెలియజేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీలనుంచి పలువురు వచ్చినా ఇప్పుడున్న కేడర్ ను కాపాడే బాధ్యత నాది.  మనవారిని ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోను. పార్టీకోసం ఎవరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, మీ బాధ్యత నాది. 

నేను మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నా... పేటీఎం బ్యాచ్ ప్రచారం నమ్మొద్దు

నాయకులంతా అందరూ ప్రజల్లో ఉండి, ప్రజలతో మమేకమై మంగళగిరిలో భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగురవేయాలి. మంగళగిరి నుంచే పోటీచేస్తా, ఎటువంటి అపోహలు వద్దు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారాలు నమ్మొద్దు. వచ్చే ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే బాబుతో పోరాడి ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా. 

వచ్చే వందరోజులు పార్టీకోసం కేడర్ అంతా అహర్నిశలు కృషిచేయండి. ఇప్పటి వైసీపీ ఇన్ చార్జి గురించి మాట్లాడాల్సిన పనిలేదు, ఎవరేమిటో ప్రజలకు తెలుసు. రాబోయే అయిదేళ్లలో మంగళగిరి రూపురేఖలు మార్చే బాధ్యత నాది, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీకి ఘనవిజయం చేకూర్చండి.

More Telugu News