ఆ వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ
  • దరఖాస్తుల వివరాల ఆధారంగా రేషన్ కార్డుల జారీ ఉంటుందన్న మంత్రి
  • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అధికారులకు సూచన
రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని, ఆ దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పని చేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూ.. పోలీసు అధికారులకు కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అధికారులు... ప్రజలకు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండాలని హితవు పలికారు. 

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలను సమర్పించారని... గవర్నర్ నిర్ణయం అనంతరం కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యులను నియమిస్తామన్నారు. ఆ తర్వాత నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతుబంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పరిమితిని విధించలేదని తెలిపారు.

Uttam Kumar Reddy
Congress
Telangana

More Telugu News