Warangal Student: విద్యార్థినిని వేధించిన కాలేజీ ఛైర్మన్

  • అర్ధరాత్రి హాస్టల్ గదిలోకి వచ్చి లైంగిక దాడికి ప్రయత్నం
  • విద్యార్థిని కేకలు వేయడంతో నిద్ర లేచిన మిగతా స్టూడెంట్లు
  • విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి వెళ్లిపోయిన ఛైర్మన్
  • తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని
Student Harrased by College Chairman

హాస్టల్ గదిలో నిద్రిస్తున్న విద్యార్థినిపై ఆ కాలేజీ ఛైర్మన్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. అర్ధరాత్రి హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన ఆ స్టూడెంట్ కేకలు వేయగా మిగతా స్టూడెంట్లు నిద్రలేచారు. కోపంతో మండిపడ్డ ఛైర్మన్.. స్టూడెంట్లపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి వెళ్లిపోయాడు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

భీమారంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ లో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన విద్యార్థిని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్ లో మిగతా స్టూడెంట్లతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కాలేజీ ఛైర్మన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బూర సురేందర్ గౌడ్ వెళ్లాడు. విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో మిగతా విద్యార్థినులు నిద్రలేచి ఆ గదికి వచ్చారు. సురేందర్ గౌడ్ వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ విషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పడంతో తెల్లవారి వారు హాస్టల్ కు చేరుకున్నారు. కూతురితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే, సురేందర్ గౌడ్ అప్పటికే పరారయ్యాడని సమాచారం. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News