గూగుల్‌లో మరో 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు?

  • సేల్స్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే యోచనలో గూగుల్
  • ప్రస్తుతం సేల్స్ విభాగంలో 30 వేల పైచిలుకు ఉద్యోగులు
  • సంస్థలో ఏఐ వినియోగం పెరుగుతుండటంతో తగ్గుతున్న ఉద్యోగుల అవసరం
  • ఫలితంగా, మరోమారు లేఆఫ్స్ తప్పవని అంచనా
టెక్ రంగంలో కృత్రిమ మేధకు నానాటికీ ప్రాధాన్యం పెరుగుతోంది. తన కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్న గూగుల్ తాజాగా సేల్స్ విభాగం పునర్వ్యవస్థీకరణపై యోచిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం గూగుల్ సేల్స్ విభాగంలో 30 వేల పైచిలుకు మంది ఉద్యోగులు ఉన్నారు. దీంతో, ఉద్యోగాల్లో కోత తప్పదన్న భయం వ్యక్తమవుతోంది. 

వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్ విధానాన్ని సరళీకృతం చేసేందుకు గూగుల్ మెషీన్ లెర్నింగ్ సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతోంది. కొత్త యాడ్స్‌ సృష్టిలో ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకుంటోంది. ఈ సాంకేతికత మంచి సామర్థ్యంతో పనిచేయడం, ఉద్యోగుల అవసరం తగ్గడంతో గూగుల్ లాభాల మార్జిన్లు పెరుగుతున్నాయి. 

గూగుల్‌లో ఏఐ వినియోగం పెరిగేకొద్దీ ఉద్యోగాల్లో కోతలు మొదలవుతాయని ది ఇన్ఫర్మేషన్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం గూగుల్ వినియోగిస్తున్న పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్ టూల్‌.. ప్రకటనల రూపకల్పన, ప్లేస్‌మెంట్ వంటి విషయాల్లో అడ్వటైజర్లకు సహకరిస్తోంది. అనేక విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంది. అప్పటికప్పుడు రియల్ టైంలో యాడ్లలో మార్పులు చేస్తూ ప్రకటనల ప్రభావశీలతను ఈ టెక్నాలజీ పెంచుతోంది. ఫలితంగా ఉద్యోగుల అవసరం తగ్గుతుండటంతో లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.

Google-JobCuts
Google
Artificial Intelligence

More Telugu News