Crime News: ఫంక్షన్ ఉందని నమ్మించి భార్యను బయటకు తీసుకెళ్లి దారుణంగా చంపేసిన భర్త!

Hasband killed wife and said his wife missing
  • హైదరాబాద్ శివారు మియాపూర్‌లో ఘటన
  • భార్యాభర్తల మధ్య ఇటీవల పొడసూపిన మనస్పర్థలు
  • భార్యను చంపి కనిపించడం లేదంటూ ఆమె తల్లికి ఫోన్
  • పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి
భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న వివాదం హత్యకు దారితీసింది. ఫంక్షన్ పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లి దారుణంగా చంపేసిన భర్త.. ఆపై ఆమె కనిపించడం లేదంటూ నాటకమాడాడు. చివరికి పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన రాజేశ్వరి (38)కి అదే జిల్లా రుద్రురుకు చెందిన కార్పెంటర్ రాజేశ్‌తో 2005లో వివాహమైంది. ఆ తర్వాత వారు హైదరాబాద్ వచ్చి మియాపూర్‌లో ఉంటున్నారు. వీరికి 17, 18 సంవత్సరాలున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు బోధన్‌లో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.

గత కొంతకాలంగా రాజేశ్వరి, రాజేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి మరింత పెరగడంతో భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 10న గండిమైసమ్మ ప్రాంతంలో ఓ ఫంక్షన్ ఉందని భార్యను నమ్మించి బైక్‌పై తీసుకెళ్లాడు. బౌరంపేట సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్దకు తీసుకెళ్లి బండరాయితో మోది భార్యను హత్యచేశాడు. ఆపై అక్కడే ఉన్న కాల్వలో పడేశాడు. రెండు రోజుల తర్వాత రాజేశ్వరి తల్లి, సోదరికి ఫోన్ చేసి భార్య కనిపించడం లేదని చెప్పాడు. అనుమానించిన రాజేశ్వరి తల్లి ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. రాజేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Crime News
Miyapur
Hyderabad

More Telugu News