అర్ధరాత్రి హైదరాబాద్ పబ్లలో పోలీసుల తనిఖీలు.. తొలిసారి స్నిఫర్ డాగ్స్ వినియోగం
- న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న పబ్లు
- డ్రగ్స్, గంజాయిని పెద్దఎత్తున సమకూర్చుకుంటున్నట్టు సమాచారం
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్బుల్లో తనిఖీలు
రేవంత్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక డ్రగ్స్పై ప్రత్యేక దృష్టిసారించింది. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, డ్రగ్స్తో దొరికితే ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ఈ నేపథ్యంలో గత రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని పలు పబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో తొలిసారి స్నిఫర్ డాగ్స్ ఉపయోగించారు.
న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండడంతో సెలబ్రేషన్స్ కోసం పబ్లు సిద్ధమవుతున్నాయి. వేడుకల్లో మాదకద్రవ్యాలు, గంజాయి వంటివి విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉందని, పెద్ద ఎత్తున వాటి క్రయవిక్రయాలు జరిగే అవకాశం ఉందని వచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 10, 36, 45లోని పబ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలకు సంబంధించిన వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు.