India vs South Africa: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మొదటి వన్డేకి టీమిండియా తుది జట్టు ఇదే !.. ఇద్దరు కొత్త కుర్రాళ్ల అరంగేట్రం?

  • ఓపెనర్లుగా  రజత్ పాటిదార్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్
  • సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో యువ జట్టుతో ఆడనున్న భారత్
  • జోహనెస్‌బర్గ్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న మొదటి వన్డే
This is the expected team of Team India for the first ODI against South Africa

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జోహనెస్‌బర్గ్ వేదికగా నేడు (ఆదివారం) తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో ఆడనున్న భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకోవడం, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో యువ జట్టుతో భారత్ ఆడనుంది. కేఎల్ రాహుల్ వన్డే సిరీస్‌కు నాయకత్వం వహించనున్నాడు.

జట్టు సిరీస్‌ కోసం సన్నద్ధమవుతున్న రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మొదటి వన్డేలో కొత్త జోడీ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుంది. ఇక కొత్త కుర్రాళ్లు రజత్ పాటిదార్, సాయి సుదర్శన్ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలి వన్డేలోనే వీరిద్దరికీ అవకాశం దక్కొచ్చనే అంచనాలున్నాయి. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో వీరిద్దరు సెలెక్టర్లను మెప్పించారు. ఇక టీమిండియా జెర్సీ ధరించే సమయం వచ్చిందని టీమిండియా వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రేయాస్ అయ్యర్ 3వ స్థానంలో, కేఎల్ రాహుల్ 4వ స్థానంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇక తిలక్ వర్మ, సంజూ శాంసన్ 5, 6వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. శాంసన్ మొదటి వన్డేలో పునరాగమనం చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌గా తీసుకుంటారా లేక బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆల్-రౌండర్ కోటాలో అక్షర్ పటేల్, స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్‌లు ఆడనున్నారు.

టీమిండియా తుది జట్టు అంచనా:
రజత్ పాటిదార్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

More Telugu News