Nimmagadda Ramesh Kumar: ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేయడం సరికాదు: నిమ్మగడ్డ

Nimmagadda participates protest in Duggirala

  • గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన
  • ఫారం-7 బాధితులతో కలిసి నిరసన ప్రదర్శన
  • అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పర్యటించారు. ఓట్ల జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎలుగెత్తారు. ఫారం-7 బాధితులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మన ఓటు మన హక్కు అంటూ ఫారం-7 బాధితులతో కలిసి నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఓటు హక్కుకు విఘాతం కలిగించేలా ఫారం-7 దరఖాస్తులు వస్తున్నాయని వెల్లడించారు. సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరికీ ఉంటుందని, ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేయడం సరికాదని అన్నారు. 

గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తులు అప్ లోడ్ చేసేవారిపై నియంత్రణ ఉండాలని నిమ్మగడ్డ సూచించారు. దుగ్గిరాలలో 23 మంది స్థానికుల ఓట్లకు ఫారం-7 పెట్టారని ఆరోపించారు. ఫారం-7 దరఖాస్తులపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశానని తెలిపారు.

  • Loading...

More Telugu News