BJP: బీఆర్ఎస్ నేతల స్వలాభం కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు: కిషన్ రెడ్డి

Kishan Reddy Open Letter To Kcr
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన జిల్లాల పునర్విభజనను అధికార పార్టీ నేతల స్వలాభం కోసం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారంటూ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. అసలు చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాలని మిమ్మల్ని అడిగిందెవరంటూ కేసీఆర్ ను ఆయన నిలదీశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు. వరుసగా ఇది తన నాలుగవ లేఖ అని, దీనికి కూడా స్పందించరా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.

జిల్లాల విభజన జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి పక్క జిల్లాలోని మండలాన్ని తన జిల్లాలో బలవంతంగా కలిపేసుకున్నాడని కిషన్ రెడ్డి చెప్పారు. దీనికి కారణమేంటని విచారిస్తే.. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ మండలంలో స్థిరపడిన తన బావమరిదిని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు అడ్డంకులు ఉండకూడదనే ఈ పని చేసినట్లు తేలిందన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో భూములు కొని, వాటికి విలువ వచ్చేలా జిల్లాలను ఏర్పాటు చేయించుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

వారి భూములకు దగ్గర్లోనే ఆయా జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయని, ఫలితంగా నాయకుల భూముల విలువ అమాంతం పెరిగిందని చెప్పారు. పది జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి ప్రజలను గాలికి వదిలేశారని సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పరిపాలనను గాలికొదిలి, ప్రజలను నడి రోడ్డు మీదికి తెచ్చిన మీకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తప్పకుండా గుణపాఠం చెబుతారని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
Go Back to Shorts
BJP
Kishan Reddy
Telangana
KCR
Districts
Open letter

More Telugu News