Dreaded Murder: గదిలో పామును వదిలి.. భార్య, రెండేళ్ల కుమార్తెను చంపిన భర్త!

  • ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘటన
  • మూడేళ్ల క్రితమే వివాహం
  • భార్యతో గొడవల కారణంగా హత్యకు పథకం
  • పాములు పట్టే వ్యక్తి నుంచి పామును తెచ్చి భార్య నిద్రిస్తున్న గదిలో వదిలిన నిందితుడు
  • తర్వాతి రోజు ఉదయం విగత జీవులుగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె
  • నెలన్నర తర్వాత విషయం వెలుగులోకి
Man Kills Wife And Daughter With Snake

భార్య, కుమార్తె నిద్రిస్తున్న గదిలోకి విషపూరిత పామును వదిలి వారిని తెలివిగా హత్యచేశాడో భర్త. పాము కాటుతోనే వారిద్దరూ మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక కూడా వెల్లడించినప్పటికీ దీనివెనక ఏదో కుట్ర జరిగిందని భావించిన బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నెలన్నర తర్వాత అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా గంజాం జిల్లాలోని కబిసూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధీగావ్‌కు చెందిన కె.గణేశ్ పాత్రా(25)-బసంతి పాత్రా (23) భార్యాభర్తలు. 2020లో వివాహమైన వీరికి రెండున్నరేళ్ల కుమార్తె దేబాస్మిత ఉంది. భార్యతో గొడవల కారణంగా ఆమెను హత్య చేయాలని భావించిన గణేశ్ తెలివిగా పామును ఎంచుకున్నాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి విషపూరిత పామును సంపాదించి ఓ ప్లాస్టిక్ జార్‌లో అక్టోబరు 6న ఇంటికి తీసుకొచ్చాడు. 

భార్య, కుమార్తె నిద్రిస్తున్న గదిలో పామును వదిలిపెట్టి నిందితుడు మాత్రం మరో గదిలో నిద్రపోయాడు. తర్వాతి రోజు ఉదయం చూసేసరికి భార్య, కుమార్తె ఇద్దరూ మరణించి కనిపించారు. అయితే, అల్లుడి తీరుపై అనుమానం వ్యక్తం చేసిన బసంతి పాత్రా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం బయటపడింది. తొలుత ఆరోపణలను ఖండించినా పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టాడు. వారి గదిలోకి తానే పామును వదిలినట్టు అంగీకరించడంతో నిన్న అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

More Telugu News