Sreesanth: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై చీటింగ్ కేసు

Cheating case files on former cricketer Sreesanth and two others
  • శ్రీశాంత్, రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై కేసు
  • రాజీవ్, వెంకటేశ్ లకు రూ.18.70 లక్షలు ఇచ్చానన్న సురేశ్ గోపాలన్
  • స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తానని చెప్పారని వెల్లడి
  • వారిద్దరితో శ్రీశాంత్ కు భాగస్వామ్యం ఉందని వివరణ
  • స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
టీమిండియా మాజీ పేసర్ ఎస్.శ్రీశాంత్ చిక్కుల్లో పడ్డాడు. శ్రీశాంత్ పై ఓ చీటింగ్ కేసు నమోదైంది. శ్రీశాంత్ తో పాటు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై ఉత్తర కేరళ జిల్లాలో చీటింగ్ కేసు నమోదు చేశారు. సురేశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

కొల్లూర్ లో స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పుతామంటూ రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ తన నుంచి రూ.18.70 లక్షలు తీసుకున్నారని, వారిద్దరితో శ్రీశాంత్ కు కూడా భాగస్వామ్యం ఉందని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ అకాడమీలో తాను కూడా భాగస్వామిగా ఉండొచ్చన్న ఉద్దేశంతోనే వారికి డబ్బులు ఇచ్చానని సురేశ్ గోపాలన్ వివరించారు. 

కానీ వారు స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన పోలీసులను కోరారు. సురేశ్ గోపాలన్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసులో శ్రీశాంత్ ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.

More Telugu News

Sreesanth
Cheating Case
Kerala
Team India