27 నుంచి ‘యువగళం’ పున:ప్రారంభం.. విశాఖపట్నంలోనే ముగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్‌ మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి.


400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసానాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత, మహిళలు, రైతులు, ముస్లింలు, వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు. ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని, ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.

Yuvagalam
Nara Lokesh
Telugudesam
Visakhapatnam
Chandrababu
Andhra Pradesh

More Telugu News