Congress Ex chief: జైపూర్ కు మకాం మార్చిన సోనియా గాంధీ.. కారణం ఇదే!

  • పొల్యూషన్ కారణంగా ఢిల్లీని వీడిన కాంగ్రెస్ మాజీ చీఫ్
  • రాహుల్ గాంధీ, వేణుగోపాల్ తో కలిసి జైపూర్ ప్రయాణం
  • రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఊహాగానాలు
  • ఆరోగ్యం కోసమే సోనియా వచ్చారంటున్న పార్టీ నేతలు
Sonia Gandhi Shifts To Jaipur As Delhi Air Pollution Spikes

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీని వీడారు. దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర రీతిలో పెరిగిపోతుండడంతో రాజస్థాన్ కు మకాం మార్చారు. మంగళవారం సాయంత్రం కుమారుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెంటరాగా జైపూర్ చేరుకున్నారు. పార్టీ మాజీ అధ్యక్షురాలు నగరానికి రావడంతో జైపూర్ లోని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో సోనియా ప్రచారంలో పాల్గొంటారని ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వీటిని పార్టీ సీనియర్ నేతలు ఖండించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడంతో అనారోగ్యం తిరగబెట్టే ప్రమాదం ఉందని సోనియాను వైద్యులు హెచ్చరించినట్లు చెప్పారు. డాక్టర్ల సూచన మేరకే ఢిల్లీ నుంచి జైపూర్ కు వచ్చారని, కొన్నాళ్ల పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు.

సోనియా గాంధీ వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ లో జ్వరంతో, గత జనవరిలో శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఏటా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోతుండడంతో గతంలో కూడా సోనియా నగరాన్ని వీడారు. 2020లో ఇదే సీజన్ లో సోనియా గాంధీ గోవా వెళ్లారు. మరో ఏడాది హిమాచల్ ప్రదేశ్ లోని తన కూతురు ప్రియాంక గాంధీ ఇంటికి వెళ్లారు. కాగా, ప్రస్తుతం జైపూర్ లో ఉన్న సోనియా గాంధీ తిరిగి ఢిల్లీకి ఎప్పుడు వెళతారనే విషయంపై కాంగ్రెస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఢిల్లీలో కాలుష్యం తగ్గేంత వరకూ ఆమె జైపూర్ లోనే ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News