ఛత్తీస్గఢ్, మిజోరంలలో కొనసాగుతున్న పోలింగ్.. తరలివస్తున్న ఓటర్లు
- మిజోరంలో ఒకే దశలో 40 స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్
- ఛత్తీస్గఢ్లో మొదటి దశలో 20 నియోజకవర్గాలకు పోలింగ్
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య ఎన్నికలు
నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్గఢ్లో భారీ భద్రత
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. తొలిదశలో భాగంగా 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పెద్ద సంఖ్యలో పోలీసు, ప్రత్యేక బలగాలను మోహరించింది. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కొనసాగుతున్న 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఒక్క బస్తర్ జిల్లాలో ఏకంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు.