Joe Biden: ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు

  • టెల్ అవీవ్ లో బైడెన్ కు స్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధాని
  • హమాస్ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్ కు సంఘీభావం
  • గాజా ఆసుపత్రిపై దాడి పట్ల భారత ప్రధాని విచారం
 Biden lands in Israel received by netanyahu

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఉన్నట్టుండి ఈ నెల 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు భీకర దాడులకు దిగడం, వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోయడం తెలిసిందే. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఉత్తరగాజాలో 10 లక్షల మందిని ఖాళీ చేయాలని ఆదేశించింది. అనంతరం ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా దాడులను పెంచింది. 


అమెరికా అధ్యక్షుడి కీలక పర్యటన ముందు.. గాజాలోని ఓ హాస్పిటల్ పై క్షిపణి దాడి జరగడం, 500 మంది మరణించడం గమనార్హం. దీంతో బైడెన్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ఇజ్రాయెల్ కారణమని హమాస్, హమాస్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు ఇజ్రాయెల్ ప్రకటించాయి. హమాస్ మిలిటెంట్ల దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ కు సంఘీభావంగా బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. జోర్డాన్ లోనూ బైడెన్ పర్యటించాల్సి ఉండగా, దాన్ని రద్దు చేసుకున్నారు. టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం పలికారు.  

మరోవైపు గాజా ఆసుపత్రిపై దాడి పట్ల భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. గాజాలోని అల్ అహ్లి హాస్పిటల్ లో ప్రాణ నష్టం షాక్ కు గురి చేసినట్టు పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ దాడికి పాల్పడిన వారు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

More Telugu News