Advertisement

కాంగ్రెస్‌లోని ఆ నేతలను కేసీఆర్ గెలిపించాలనుకుంటున్నారు: కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

KA Paul says praja shanthi party will contest in telangana
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అన్న కేఏ పాల్
  • కోదండరాం, షర్మిల పార్టీలను కాంగ్రెస్ వాడుకుందని ఆరోపణ
  • కేసీఆర్‌కు గుడ్ బై చెప్పాలంటే ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలని పిలుపు
  • తన వారిని కాంగ్రెస్‌లోకి పంపించి గెలిపించడం ద్వారా కేసీఆర్ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్న పాల్
తెలంగాణలో కోదండరాం, వైఎస్ షర్మిల పార్టీలను కాంగ్రెస్ వాడుకుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తన అభ్యర్థులను కాంగ్రెస్ నుంచి గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకే వారితో రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారని, ఎన్నికల్లో వారికి అయ్యే డబ్బును కూడా కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. తమ వారిని కాంగ్రెస్ నుంచి పోటీ చేయించి, గెలిపించుకోవడం ద్వారా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ, అక్రమ, అవినీతి పాలన సాగుతోందన్నారు. ఈ పాలనను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే కాంగ్రెస్‌లోని తన మద్దతుదారులను గెలిపించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. వాళ్లను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయించి, కాంగ్రెస్‌లో చేర్పించారన్నారు. నవంబర్ 30న కేసీఆర్‌కు గుడ్ బై చెప్పాలంటే ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలన్నారు. ఎక్కువ శాతం ఉన్న బీసీల నుంచి ఒక్క ముఖ్యమంత్రి అభ్యర్థి లేరా? అని ప్రశ్నించారు. అరవై శాతం ఉన్న బీసీలకు కనీసం అరవై సీట్లు ఇవ్వలేదన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. కేసీఆర్‌పై 7 కేసులు వేశానని, దీంతో కేటీఆర్ తనపై దాడి చేయించారని ఆరోపించారు. తాను తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తన ప్రజాశాంతి పార్టీ ద్వారా పోటీ చేయాలనుకున్న వారు వారం రోజుల్లో రూ.10వేలు గూగుల్ పే చేసి దరఖాస్తు పంపించాలని సూచించారు. టిక్కెట్ల కోసం అన్ని కులాల వారు ఏ పార్టీని అడగవద్దని, ప్రజాశాంతి పార్టీ అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. వారం రోజుల్లో జాబితాను విడుదల చేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఇప్పుడిస్తున్న పథకాలకు రెండింతలు ఇస్తామన్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి వరకు 3600 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.
Advertisement
KA Paul
Telangana
Telangana Assembly Election
BRS
Congress
BJP

More Telugu News