Asian Games Mens T20I 2023: రుతురాజ్, తిలక్‌వర్మ, సాయికిషోర్ సూపర్ షో.. ఆసియా గేమ్స్ ఫైనల్‌కి భారత్

  • సెమీ ఫైనల్‌-1లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన టీమిండియా
  • 9 వికెట్ల తేడాతో భారీ విజయం
  • ఫైనల్‌లో భారత ప్రత్యర్థి ఎవరో?
India beat Bangladesh In Asian Games Enters Finals

చైనాలో జరుగుతున్న ఆసియాగేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా, హాంగ్ఝౌలోని పింగ్‌ఫెంగ్‌ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-1 మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. వరుస వికెట్లు తీస్తూ కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది.  వికెట్ కీపర్ జకేర్ అలీ చేసిన 24 (నాటౌట్) పరుగులే జట్టులో అత్యధికం. ఓపెనర్ పర్వేజ్ హొసైన్ ఎమోన్ 23, రకీబుల్ హసన్ 14 పరుగులు చేశారు. మిగతా వారిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. భారత బౌలర్లలో సాయి కిషోర్‌ 3 వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌ను కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40, తిలక్ వర్మ 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఈ ఉదయం 11.30 గంటలకు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన వారు రేపు భారత జట్టుతో ఫైనల్‌లో తలపడతారు. ఓడిన జట్టు మూడో స్థానం కోసం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.

More Telugu News