దేశంలో తొలిగా మధ్యప్రదేశ్ లో మహిళలకు రిజర్వేషన్

  • 35 శాతం రిజర్వేషన్లు కల్పించిన మధ్యప్రదేశ్ సర్కారు
  • అటవీ శాఖ మినహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తింపు
  • ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ
విధానసభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉద్యోగ నియామకాల్లో 35 శాతం రిజర్వేషన్ ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్క అటవీ శాఖను ఇందుకు మినహాయించింది. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు, 1997కు ఈ మేరకు సవరణలు చేసింది. ‘‘సర్వీస్ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర సర్వీస్ పరిధిలో అన్ని పోస్ట్ లలో (అటవీ శాఖ మినహా) 35 శాతాన్ని మహిళలకు రిజర్వ్ చేస్తున్నాం’’ అని నోటిఫికేషన్ లో పేర్కొంది. 

పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం మహిళలకు కేటాయిస్తామని ఇటీవలే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేయగా, తాజా నోటిఫికేషన్ లో అన్ని ఉద్యోగాలకు దీన్ని వర్తింపజేశారు. అలాగే, లాడ్లి బెహనా యోజన’ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ప్రతి నెలా అందించే రూ.1,250ని రేపే ఖాతాలో వేస్తామని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవ్వడానికి కుదరదని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ మాదిరే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇటీవలే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం దీనిపై సంతకం చేయడం తెలిసిందే.

Madhya Pradesh
womens reservation
35 percent quota

More Telugu News