భోజనం చేసేందుకు చంద్రబాబుకు టేబుల్ కూడా ఇవ్వలేదు: నారా భువనేశ్వరి

  • టీడీపీ అంటే ఒక కుటుంబం... కార్యకర్తలంతా మా బిడ్డలే అన్న భువనేశ్వరి
  • టీడీపీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు లాఠీఛార్జ్ తిన్నారని ఆవేదన
  • మహిళలు అని చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
  • చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురి చేయలేరని వ్యాఖ్య
టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలంతా మా బిడ్డలేనని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ఆమె వీడియోను విడుదల చేశారు. టీడీపీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరిగ్గా లేదన్నారు. చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురి చేయలేరన్నారు.

చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, ఆయనను ఎవరూ క్షోభకు గురి చేయలేరన్నారు. ఆయన ధైర్యంగా ఉంటారన్నారు. చంద్రబాబు అరెస్టుకు మహిళలు నిరసన తెలుపుతుంటే వారిపట్ల కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే ఏపీలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. టీడీపీ కుటుంబానికి చంద్రబాబు పెద్ద అని, పోలీసులు ఏం చేసినా కార్యకర్తలైన టీడీపీ పిల్లలు బెదరరన్నారు.

చంద్రబాబు చేతితో ప్లేట్ పట్టుకొని భోంచేస్తున్నారని, ఆయన భోంచేయడానికి కనీసం టేబుల్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు భోంచేయడానికి టేబుల్ ఇవ్వడానికి తమ లాయర్ అనుమతి కోసం లెటర్ పెట్టవలసి వచ్చిందన్నారు. అనుమతిచ్చాకే టేబుల్ ఇచ్చారని, అలా ఆయనను మానసిక క్షోభకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ ఆయన ధైర్యంగా ఉంటారన్నారు.


More Telugu News

Nara Bhuvaneswari Chandrababu YSRCP Telugudesam