కుట్రకోణం బయటకు రావాలి: చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరిన సీఐడీ న్యాయవాది

  • చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదని, కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ
  • స్కిల్ కేసులో అసలు విషయం బయటపడుతుందనే కస్టడీని అడ్డుకుంటున్నారన్న పొన్నవోలు
  • ఈ కేసులో రికవరీ కంటే కుట్రకోణం వెలికితీయడం ముఖ్యమని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదని, ఐదు రోజుల కస్టడీ కావాలని కోరారు. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందనే కస్టడీని అడ్డుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో న్యాయం జరగాల్సి ఉందన్నారు.

చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు పొన్నవోలు తెలిపారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారన్నారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాల్సి ఉందన్నారు. ఇందులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం చాలా ముఖ్యమైన అంశమన్నారు. చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దుర్వినియోగమైన నిధులు ఎక్కడెక్కడకు వెళ్లాయో సమాచారం ఉందన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాలన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదన్నారు.

Chandrababu
cid
Andhra Pradesh

More Telugu News