దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసమే పార్లమెంటు వద్ద నిరసన చేపట్టాం: గంటా

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
  • ఢిల్లీలో టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి పార్లమెంటు వద్ద లోకేశ్ ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న గంటా, కాల్వ శ్రీనివాసులు
ఢిల్లీలో ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్ పై దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే పార్లమెంటు భవనం వద్ద ధర్నా చేపట్టామని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ రాక్షస క్రీడలో ఓ భాగమని విమర్శించారు. గతంలో చంద్రబాబుపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక విచారణలు జరిపారని, కానీ, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని అన్నారు. 

కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఏపీ పరిస్థితే అందుకు ఉదాహరణ అని అన్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్  చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, ఏపీలో జరుగుతున్న విధ్వంసక పాలనపై కేంద్రం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Ganta Srinivasa Rao
Dharna
Parliament
TDP
Chandrababu
Arrest
Andhra Pradesh

More Telugu News