Siddharth Luthra: చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై రాజమండ్రి పీఎస్ లో ఫిర్యాదు

టీడీపీ అధినేత చంద్రబాబు కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సిద్ధార్థ లూథ్రా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు దీనికంతటికీ కారణం. 

స్కిల్ కేసులో రెండ్రోజుల పాటు తీవ్రంగా వాదించినప్పటికీ చంద్రబాబుకు అనుకూలంగా ఫలితం తీసుకురాలేకపోయిన లూథ్రా ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే ఇక కత్తి దూసి పోరాడడమే మార్గం అని పేర్కొన్నారు.  అదే పోస్ట్ క్రింద 'న్యాయవాదుల కత్తి న్యాయం' అంటూ కామెంట్స్ పెట్టారు.

ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని రౌతు సూర్యప్రకాశరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని సూర్యప్రకాశరావు తెలిపారు. సిద్థార్థ లూథ్రా తన పోస్టును ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Siddharth Luthra
Complaint
Rajahmundry
Routhu Suryaprakash Rao
YSRCP
TDP

More Telugu News