Parliament: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ

BJP and Congress Issue Whip To Their MPs To Remain Present During Special Session Of Parliament
  • ఈ నెల 18నుంచి 22 వరకు సమావేశాలు
  • సమావేశాల ఎజెండాను ప్రకటించిన ఉభయ సభలు
  • ఐదు కీలక బిల్లులపై జరగనున్న చర్చ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుస్తు, జమిలి ఎన్నికలకు వెళ్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సమావేశాలు ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులందరికీ విప్‌లు జారీ చేశాయి. కీలకమైన అంశాలు, బిల్లులు చర్చకు రాబోతున్నందున ప్రతి ఎంపీ హాజరుకావాలని రెండు పార్టీలు కోరాయి. ఈ సమావేశాల ఎజెండాను రాజ్యసభ, లోక్‌సభ బులిటెన్ల ద్వారా విడుదల చేసిన నేపథ్యంలో ఈ విప్‌లు జారీ చేశాయి. కాగా, మొదటిరోజు సమావేశంలో పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు బీజేపీ తమ విప్‌లో తెలిపింది.

ఈ సమావేశాల్లో కీలకమైన ఐదు బిల్లులు ఉభయ సభల ముందుకు రాబోతున్నాయి. వీటిలో ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2003, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, ఎన్నికల కమిషనర్ బిల్లు ఉన్నాయి. ఎజెండాలో వెల్లడించని అంశాలను కూడా బీజేపీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 22వ తేదీ వరకూ ఎంపీలంతా తప్పని సరిగా హాజరై, పార్టీ వైఖరికి మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ తమ విప్‌లో స్పష్టం చేసింది.
Parliament
Special Session
BJP
Congress
MPs

More Telugu News